తెలుగు చిత్ర పరిశ్రమకి కూడా వేసవి తాపం బాగా ఎక్కువైంది. అందుకే కథానాయకులు అందరూ ఈ వేసవి తాపం తట్టుకోవటానికి విదేశాలు విశ్రాంతి (వెకేషన్) కోసం వెళుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే దారిలో విదేశాలకి తన స్పెషల్ విమానంలో బయలుదేరారు. ఇదే విషయాన్ని అతను తన చిత్రం ద్వారా చెప్పారు. తనకున్న ప్రత్యేక విమానంలో తన సీటుపై తన పెట్ డాగ్ కూర్చుని ఉంటే, రామ్ చరణ్ అదే సీటు అంచున కూర్చొని బయటకి చూస్తున్నారు ఆ చిత్రంలో.
మార్చి 27న పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్ ఆరోజు ఎంతో బిజీగా గడిపారు. అదేరోజు తెల్లవారుజామున తిరుపతి వెళ్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కుటుంబంతో సహా దర్శనం చేసుకొని అదే రోజు ఉదయం హైదరాబాదు చేరుకున్నారు. ఇక అక్కడ నుండి అభిమానులు రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేస్తూనే వున్నారు.
అంతకు ముందు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా విశాఖపట్నంలో చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇలా వరసగా తీరిక లేకుండా పని చేస్తూ ఇప్పుడు చిత్రీకరణకు కొంత విరామం ప్రకటించి విశ్రాంతి కోసమని విదేశాలకి పయనం అవుతున్నారు. రామ్ చరణ్ థాయిలాండ్ వెళుతున్నట్టుగా తెలిసింది.
శంకర్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా ఇప్పటికే బాగా ఆలస్యం అయిందని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత. అయితే రామ్ చరణ్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగి వచ్చి ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యేవరకు పాల్గొంటారని తెలిసింది. తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చెయ్యవలసిన సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు